ప్రాణాలు తీసిన భూ తగాదాలు
– ఆస్తికోసం కొడుకునే చంపిన తండ్రి
– పెద్దేముల్ మండలం ఇందూరులో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆస్తుల కోసం పేగు బంధాల మంటకలుపుతున్న రోజులు దాపరించాయి. భూతగాదాల విషయంలో ఓ కన్నతండ్రి కొడుకునే హతమార్చాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన జానీమియాకు ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు గోరేమియా(28) హైదరాబాద్లో ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల మద్య గతకొన్ని రోజుల నుంచి భూతదగాదాలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మళ్లీ తగాదాలు జరగడంతో తండ్రి జానీమీయా చిన్న భార్య కుమారుడు అయిన గోరేమియాను కర్రతో దాడి చేశాడు. గోరేమీయాకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే హత్యలో జానీమియాతో పాటు మొదటి భార్య ప్రమేయం కూడ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తరువాత నిందితులు పరారయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు తండ్రి తన కుమారున్ని హత్య చేసిన నేరాన్ని అంగీకరించాడని, బీదర్ వెళ్లిన అతను తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోతానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

