గ్రామాల్లో గులాబీ జోష్..
– జోరుగా గ్రామ కమిటిల ఎన్నికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికార టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత పండగ ఉత్సహంగా జరుగుతోంది. తాండూరు నియోజకవర్గంలో గులాబీదళం అంతా పుష్ జోష్ మీద ఉన్నారు. గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గ్రామాల్లో గ్రామ కమిటి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి వర్గీయులు పోటాపోటీగా గ్రామ కమిటీలను ఎన్నుకుంటున్నారు. ఇప్పటికే తాండూరు మండలంలో అల్లాపూర్, చెంగోల్, చెన్గెష్పూర్, రాంపూర్, జినుగుర్తి, అంతారం, పర్వతాపూర్ తదితర గ్రామాల్లో గ్రామ కమిటిలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్ మండలంలో పర్వత్పల్లి, తదితర గ్రామాల్లో గ్రామ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. బుధవారం నుంచి యాలాల, పెద్దేముల్ మండలాల్లో కూడ గ్రామ కమిటిలను ఎన్నుకోబోతున్నారు. దీంతో గ్రామ గ్రామానా గులాబీదళం జోష్ కనిపిస్తోంది.


