కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్కు షాక్..!
– పదవి నుంచి వరాల శ్రీనివాస్ రెడ్డిని తొలగింపు
– కొత్త ఫ్లోర్లీడర్గా మధుబాల నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డికి ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగించినట్లు ఐసీసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ ప్రకటించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడిన వరాల శ్రీనివాస్ రెడ్డి ఆ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 13వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందిన వరాల శ్రీనివాస్ రెడ్డికి పార్టీ ఫ్లోర్ లీడర్ పదవిని అప్పగించారు. తాజాగా ఆయనను పదవి నుంచి తొలగించడం మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఆయనను పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఎం.రమేష్ మహరాజ్ ప్రకటించారు. ఆయన స్థానంలో కొత్త మున్సిపల్ ఫ్లోర్ లీడరుగా మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు పార్టీ కౌన్సిలర్ మధుబాలను నియమించడం జరిగిందని తెలిపారు. నియామకపత్రాలను మున్సిపల్ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. మరోవైపు పదవి నుంచి తొలగించబడిన వరాల శ్రీనివాస్ రెడ్డి తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అని రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

