కేక పెట్టిన మున్సిపల్ కార్మికులు
– పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్
– కార్యాలయం ముందు బైటాయించి టోకన్ సమ్మె
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్మికులు మళ్లీ కేక పెట్టారు. పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం విధులు ముగించుకుని ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు టోకన్ సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నిచోట్ల పెంచిన వేతనాలు అమలు చేస్తుంటే తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అమలు చేయడం లేదన్నారు. రెండేళ్లుగా తాత్సారం చేస్తున్నారని అన్నారు. పెంచిన వేతనాలు అమలు చేయకపోవడంతో పెరిగిన ధరలకు జీవనం సాగించలేక ఇబ్బందులు పడుతున్నామని. ఆవేధన వ్యక్తం చేశారు. 18 మంది కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు చీపుర్లు, నూనెలు, పనిముట్లు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, పాలకవర్గం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడకుండా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యకరమంలో ఏఐటీయూసీ జిల్లా సెక్రటరి గోపాల్, మున్సిపల్ ఏఐటీయూసీ అధ్యక్షులు వీరేశం, కార్యదర్శి భూపతి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

