శ్రీ సాయి మేధలో వైభవంగా బోనాల పండుగ
– ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు
– బోనాలు, పోతురాజుల సంబరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో సోమవారం బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

పాఠశాలలో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారితో పాటు శివాజీచౌక్ లోని సౌరమ్మ మాతకు విద్యార్థులు భక్తిశ్రద్ధలతో బోనమెత్తి నైవేద్యాలు అర్పించారు.

చక్కటి చదువుతో పాటు ఇంటిల్లిపాదిని చల్లంగా చూడు తల్లి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులకు, డీజే పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీ సాయి మేధ విద్యాలయ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయంలో భాగంగా బోనాల ఉత్సవాలను పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు.

విద్యార్థి స్థాయి నుంచే దైవభక్తి, దేశభక్తి పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


