మీరే నా బలం.. బలగం..!

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

మీరే నా బలం.. బలగం..!
– బీఆర్ఎస్‌ బలోపేతంలో కార్యకర్తలే కీలకం
– ఆత్మీయ సందేశమిచ్చిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణరాష్ట్రంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి స్వీయంగా సీఎం కేసీఆర్‌ మీరే నా బలం.. బలగం అంటూ కొనియాడారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) బలోపేతంలో కార్యకర్తలే కీలకం కావల్సిన అవసముందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సందేశాలతో లేఖరాశారు. ఈ క్రమంలో కార్యకర్తల కృషితోనే పార్టీకి రెండుసార్లు అధికారం లభించిందని, నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ తన లేఖలో తెలియజేశారు. తెలంగాణతో పాటు దేశం కూడా బాగుపడాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు తన ఆత్మీయ సందేశంతో పిలుపునిచ్చారు. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత గులాబీ సైనికులకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండు సార్లు భారాస అధికార పగ్గాలు చేపట్టింది. పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తల బలంతోనే 60లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా భారాస ఎదిగింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసి 21ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను అందుకుంది.పల్లెల్లో, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి కొండంత అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్స్‌.. భారాసకు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి కాంతులు విరజిమ్మే నేలగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం. కష్టాలు, కన్నీళ్లు, కరవులతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతుంది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడింది, కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతుంది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’’ అని కేసీఆర్‌ తెలిపారు. సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. పార్టీ శ్రేణులే నా బలం, వారే నా బలగం. చిల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ భారాస ఆదరించబోదు. ఎన్నికల ఏడాదిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత శ్రేణులపైనే ఉంది. ఎన్నటికైనా ధర్మమే జయిస్తుంది’’ అని కేసీఆర్‌ అన్నారు