పేకాట స్థావరంపై దాడులు..!
– ఆరు మందిపై కేసు నమోదు
– వివరాలు వెల్లడించిన పెద్దేముల్ ఎస్ఐ అన్వేష్ రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పెద్దేముల్ మండలంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, పెద్దేముల్ మండల పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కందనెల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా స్థావరం వద్ద రూ. 32 వేల నగదు, నిందితుల మోబైల్ ఫోన్లను కూడ స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా సరే నిషేధిత జూదం పేకాట, మట్కా వంటి వాటికి బానిసలు కావద్దని అన్నారు. వ్యసనంతో ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

