కేటీఆర్తో భేటీ అయిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– తాండూరు నియోజకవర్గ కమిటిల ఏర్పాటుపై చర్చ
– పార్లమెంట్ ఇంచార్జ్ ఎంపీ రాములు నేతృత్వంలో ఎన్నికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలు భేటి అయ్యారు. తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రామ కమిటిల ఏర్పాటులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల మద్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాండూరు చోటు చేసుకున్న ఈ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలో సోమవారం కేటీఆర్ హైదరాబాద్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఇంచార్జ్ ఎంపీ పోతుగంటి రాములు, చేవేళ్ల పార్లమెంట్ ఎంపీ రంజిత్రెడ్డిలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఇంచార్జ్ జహాంగీర్ పాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లతో పార్టీ కమిటీల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇకపై తాండూరు నియోజకవర్గంలో ఎలాంటి విభేధాలు తలెత్తకుండా పార్లమెంట్ ఇంచార్జ్ ఎంపీ పోతుగంటి రాములు సమక్షంలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్తో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సమావేశం కావడంపై ఇరు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

