అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు
– అధికారుల కోసం వేట
– రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కాబోతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు అధికారులను గుర్తించడంలో వేటను ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్లో పర్యటించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రత్యేక పోలీసు నోడల్ అధికారి, కేంద్ర పోలీసు బలగాల నోడల్ అధికారితో కీలకమైన సమావేశాలు ఉంటాయని వివరించారు. ఎన్నికల సందర్భంగా భద్రత అంశాలు, వ్యూహాలు సిద్ధం చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర బృందం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఐటీ, ఎస్సీబీ, ఎక్సైజ్, రాష్ట్ర జీఎస్టీ, కేంద్ర జీఎస్టీ, ఈడీ, ఎస్ఎల్బీసీ, డీఆర్ఐ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో పోలీసుల జిల్లా పోలీసు అధికారులు కీలకమని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఎన్నికల కోసం అదనపు సిబ్బంది అవసరమని వెల్లడించారు. డీజీపీ, ఐటీ, జీఎస్టీ అధికారులతో కలిసి సరిహద్దు చెక్పోస్టులు గుర్తించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, అధికారుల సమాయత్తత తదితర అంశాలు మదింపు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, సమాయత్తంపై చర్చించేందుకు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సమాయత్తం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు డీజీ సంజయ్జైన్, స్వాతిలక్రా, ఐజీ షానవాజ్ఖాన, ఐపీఎస్ సన్ప్రీత్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


