వేప చెట్టుకు, రావిచెట్టుకు పెళ్లి
– భారీగా తరలివచ్చిన ప్రజలు
– ఇంతకీ పెళ్లి ఎందుకు చేశారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రకృతితో పాటు మానవ జీవనంలో ఏమైనా దోషాలు ఉంటే వారి పరిష్కారానికి పూజలు, ఇతర కార్యాలు జరిపిస్తారు. ఉదహరణకు వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి చేస్తారు. ఇక సంతానం కలగాలని, దోషాలు తొలగి పోవాలని వేప, రావి చెట్లకు పూజలు నిర్వహిస్తారు. వేప చెట్టును విష్ణువు.. రావి చెట్టు లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. దేవాలయాల్లో వేప, రావి చెట్లకు పూజలు చేయడం సహజమే. ఈ రెండు పెనవేసుకున్నట్లు ఉండే చెట్లను అత్యంత పవిత్రంగా భావిస్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని పూసల సంఘం కళ్యాణ మండపంలో పెనవేసుకున్న వేప – రావి చెట్లు ఉన్నాయి. తాజాగా ఈ రెండు చెట్లకు పెండ్లి జరిపించడం విశేషమైన చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన పెద్దలు, దంపతులు వేప చెట్టుకు, రావి చెట్టుకు పెండ్లి జరిపించారు. వేప – రావి చెట్ల బంధానికి పెళ్లి చేస్తే కుజ దోషం, కాల సర్ప దోషం, నష్ట దోషాలు తొలగి పోతాయని, సంతానం కలుగుతుందని నమ్ముతున్నారు. సాధారణ పెళ్లి మాదిరిగానే పెళ్లి అనంతరం సంఘ సభ్యులు అన్నదానం చేశారు. అయితే రావి, వేప చెట్లకు పెళ్లి కార్యక్రమాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇది కూడా చదవండి…


