బర్త్ డే ర్యాలీలో దుర్ఘటన
– జనరేటర్ ట్రాలీ కింద పడిన బాలుడు
– పరిస్థితి విషమం, హైదరాబాద్ తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఓ బీఆర్ఎస్ నాయకుడి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో దుర్ఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో ట్రాక్టర్ ద్వారా ఉపయోగించిన జనరేటర్ ట్రాలీ కింద ఓ బాలుడు పడిపోయాడు. బాలుడి పరిస్థితి విషమంగ మారడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు అబ్రార్ లాల జన్మదిన వేడుకల సందర్బంగా హైదరాబాద్ నుంచి పంజాగుట్ట ఫయాజ్ను ఆహ్వానించారు. మంగళవారం రాత్రి ఆయనకు స్వాగతం పలికేందుకు పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ను అనుసంధానంగా జనరేటర్ ట్రాలీనీ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అక్కడి నుంచి ర్యాలీ ఇందిరా చౌరస్తా వైపు ప్రారంభమయ్యింది. అదే సమయంలో పట్టణంలోని రహెమత్ నగర్ మునావర్ కుమారుడు రెహాన్(14) చౌరస్తా వైపు సైకిల్పై వెళుతుండగా ఓ భైకు ఢీకొట్టింది. ఈ క్రమంలో రెహాన్ ర్యాలీలో సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసుకున్న జనరేటర్ ట్రాలీ కింద పడిపోయాడు. రెహాన్ పైనుంచి ట్రాలీ దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే బాలుడు రెహాన్ను చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు పరిస్థితి విషయంగా ఉందని హైదరాబాద్కు రిఫర్ చేశారు. మరోవైపు జరిగిన దుర్ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పట్టణ పోలీస్టేషన్ వద్దకు చేరుకున్నారు.
ఇది కూడా చదవండి…

