చెలరేగిన పందెంరాయుళ్లు..!
– అనంతగిరి అడవిలో రేస్ ఆట
– కార్లు, బైకులతో సాహస విన్యాసాలు
– సందర్శుకుల భయాందోళన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఆట విడుపు కోసం వచ్చిన వాళ్లు పందెం రాయుళ్ల అవతారం ఎత్తారు. ఆహ్లాదకరమైన అడవి ప్రాంతంలో కార్లు, బైకులతో సాహసాలు చేస్తూ సందర్శకులను భయాందోళనకు గురిచేశారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జరిగిన ఈ దృశ్యాలు సంచలనంగా మారాయి. మంగళవారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు అనంతగిరికి వచ్చారు. అధికారులు స్వాతంత్య్ర దినోత్సవంలో మునిగి ఉండగా వారు వచ్చిన కార్లు, బైక్ పందాలతో అలజడి సృష్టించారు. నిత్యం అనంతగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓ ఎస్ఐ, సిబ్బందితో కూడిన ప్రత్యేక సంచార వాహనాన్ని ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నారు. వీరుకూడా లేకపోవడంతో మరింత చెలరేగిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర బైక్, కారు పందాలు (రేసులు) పెట్టుకొని స్థానికులను, సందర్శకులు భయభ్రాంతులకు గురిచేశారు. సాహసోపేతమైన విన్యాసాలతో కార్లు, బైక్లు చేసే పెద్ద పెద్ద శబ్దాలతో దుమ్ము రేపారు. పందాలకు అటు పోలీసు, ఇటు అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. ఈ సంఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కార్లు, బైకుల పందెం తీరు సంచలనంగా మారింది. సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనపై ప్రత్యేక దృష్టిసారించి.. కఠిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, సందర్శకులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి…

