స్మార్ట్ ఫోన్తో నోటి క్యాన్సర్ గుర్తింపు
– కనుగొన్న హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రతినిధులు
– త్వరలోనే అందుబాటులోకి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఆరోగ్య సేవలకూ కూడా ఉపయోగ పడుతోంది. శరీరంలో ఉన్న రోగాల గుర్తింపుకు సహకరిస్తుంది. తాజాగా స్మార్ట్ ఫోన్తోనే నోటీ క్యాన్సర్ కూడా గుర్తింవచ్చని తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐ-హబ్, ఐఎన్ఏఐ ప్రతినిధులు చేసిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని కనుగొన్నారు.
స్మార్ట్ఫోన్తో నోటి కుహరం వద్ద ఫొటోలు తీస్తేచాలు.. ఫోన్లోని ఏఐ స్టాఫ్వేర్ క్యాన్సర్ ఉందా? లేదా? అనేది గుర్తిస్తుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉందా? చివరిదశకు చేరుకుందా? అన్న అంశాలనూ విశ్లేషిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రబలుతున్న నోటి క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే వేగంగా గుర్తించేందుకు ఇది దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బయాప్సీ అవసరం లేకుండానే నోటి కుహరంలో గాయాలు, చిన్న చిన్న కణితుల్లో రక్తస్రావం వంటివాటిని స్మార్ట్ఫోన్ ఫొటోలు తీయగానే.. ఏఐ విశ్లేషించి క్యాన్సర్ దశను తెలుపుతుందని తెలిపారు.
డేటాబేస్లోని ఫొటోలతో.. కొత్తగా నోటి కుహరంలో తీసిన ఫొటోలను అనుసంధానిస్తే వాటి విశ్లేషణ ద్వారా సాఫ్ట్వేర్.. గ్రేడింగ్లను ఇస్తుంది. క్యాన్సర్ను గుర్తించడంతో పాటు ఏ దశలో ఉందో నిర్ధరిస్తుంది. అలాగే క్యాన్సర్ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు అవసరం కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి నిర్వహించడం కొంత కష్టమే. అయితే ఈ స్మార్ట్ఫోన్తో విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా చాలామందిలో క్యాన్సర్ ముప్పును తప్పించవచ్చని ఐఎన్ఏఐ సీఈవో కోనల వర్మ తెలిపారు. ఈ ప్రత్యేక స్మార్ట్ఫోన్ త్వరలో తెలంగాణలో ప్రభుత్వ వైద్యులకు అందుబాటులోకి రానుంది. వీరి పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది.
ఇది కూడా చదవండి…

