ఆసుపత్రి స్థాయి పెంచడం గర్వకారణం
– జిల్లా ఆసుపత్రి వైద్యులను సన్మానించిన మార్వాడి యువమంచ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ఆసుపత్రిని జాతీయ స్థాయిలో నిలపడం ఎంతో గర్వకారణమని మార్వాడి యువమంచ్ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సర్డా, తాండూరు అధ్యక్షులు సన్నిఅగ్రవాల్, కోశాధికారి కిషన్ రాఠి, సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంచ్ సభ్యులు మాట్లాడుతూ గతంలో ఆసుపత్రిలో రోగులకు సరైన సేవలందక ఇబ్బందులు పడేవారన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్గా డాక్టర్ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో మెరుగైన సేవలందుతున్నాయన్నారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రం, డయాలిస్, రక్తనిధి కేంద్రం, సిటీ స్కాన్ వంటి సేవలతో పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. గతనెలలో రికార్డు స్థాయి ప్రసవాలు చేసి జాతీయ స్థాయిలో ఆసుపత్రికి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. ఆసుపత్రి స్థాయిని పెంచిన సేవలను కొనసాగించాలని, ఇందుకు మార్వాడి యువమంచ్ తరుపున పూర్తి సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ సభ్యులు సంజయ్ సోని, రామకాంత్ పండిత్, కరణ్జైన్, ఓం తివారి, శ్రీగోపాల్ రాఠీ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


