అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ఫోర్స్ పంజా
– రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
– పెద్దేముల్ పోలీసులకు అప్పగింత
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: అక్రమ ఇసుక రవాణాపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. సోమవారం తెల్లవారు జామున మన్సాన్పల్లి వాగు నుండి పెద్దేముల్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు ఆగ్రో వే బ్రిడ్జి సమీపంలో దాడులు నిర్వహించారు. ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్ల వద్ద వివరాలను సేకరించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. పట్టుకున్న ట్రాక్టర్లను పెద్దేముల్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేస్తామని పెద్దేముల్ పోలీసులు వెల్లడించారు.


