తాండూరంతా.. బతుకమ్మ సంబరాలు
– కళాశాలల్లో ఆడిపాడిన విద్యార్థినిలు
– పాల్గొన్న చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలిచే బతుకమ్మ సంబరాలను తాండూరులో వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల, శాలివాహన డిగ్రీ కళాశాల, శ్రీ సాయి డిగ్రీ కళాశాలల్లో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. శాలివాహన డిగ్రీ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలకు వారు భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. అనంతరం కళాశాలల విద్యార్థులతో పాటు మహిళ అద్యాపకులతో కలిసి చైర్ పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలులు ఆడిపాడారు. ఈ కార్యక్రమాల్లో ఆయా కళాశాల యజమాన్యం, ప్రిన్సిపల్లు, అద్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు సాయంత్రం తాండూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కాలనీలో మహిళలు అందంగా పేర్చిన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆట పాటలాడుతూ ఉత్సహాంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేశారు.


