
‘రికార్డు’ వేలానికి ఎసరు..?
– డబ్బులు చెల్లించని వ్యాపారి
– వ్యర్థాల సేకరణ టెండర్కు బ్రేక్
– అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన తాండూరు మున్సిపల్ బహిరంగ వేలంకు ఎసరు పడింది. వేలం దక్కించుకున్న వ్యాపారి నగదు చెల్లించక పోవడంతో అతను చెల్లించిన అత్తెసరు డిపాజిట్ సొమ్ముతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల 18న తాండూరు మున్సిపల్లో చికెన్, మటన్ వ్యర్థాల సేకరణ కోసం బహిరంగ వేలం నిర్వహించారు.

ఈ వేలంలో కోడంగల్, పరిగి, గద్వాల్ ప్రాంతాలకు చెందిన 5 మంది వ్యాపారులు పాల్గొన్నారు. కోడంగల్కు చెందిన రఫీ అనే వ్యాపారి అత్యధికంగా రూ. 30లక్షల 65 వేలకు పాడి దక్కించుకున్నారు. బహిరంగ వేలంలో ఇంత మొత్తంలో ఆధాయం రావడం తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు అంటూ అప్పట్లో ప్రకటించారు. అయితే వేలం దక్కించుకున్న వ్యాపారి నిబంధనల ప్రకారం.. 7 రోజుల్లోపు వేలం డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
డబ్బులు చెల్లిస్తే జులై 1 నుంచి టెండర్ అందించాల్సి ఉంటుంది. కాని వేలం దక్కించుకున్న వ్యాపారి వ్యాపారి గడువు ముగిసి ఐదు రోజులు అవుతున్నా డబ్బులు జమ చేయలేనట్లు తెలిసింది. దీంతో చికెన్, మటన్ వ్యర్థాల సేకరణకు మళ్లీ బ్రేక్ పడింది. టెండర్ అమలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వ్యర్థాల సేకరణ టెండర్ రెండుసార్లు వాయిదా పడింది. వాయిదా పడడం ఇది మూడో సారి అంటూ పలువురు గుర్తుచేస్తున్నారు.
ఇదికూడ చదవండి…

