పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
– 8 మంది అరెస్టు.. రూ.82,770 నగదు స్వాధీనం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు రూరల్ కరణ్కోట్ పోలీస్స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు.

టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.82,770 నగదును స్వాధీనం చేసుకున్నారు.

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా తెలిపారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం కరణ్కోట్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


