దోషులకు ఉరే సరి..!
– వైద్యురాలిపై హత్యాచారం దారుణం
– కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– వైద్యుల నిరసనకు సంఘీభావం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్యురాలిపై హత్యాచార ఘటనపై పాల్పడిన దోషులను ఉరితీయడమే సరైన శిక్ష అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోల్ కత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ ను అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు శనివారం తాండూరు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
వైద్యులు, సిబ్బందితో పాటు ఇందిరా చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోల్ కత్తాలోని జూనియర్ డాక్టర్ సంఘటన కలిచివేసిందన్నారు. 36 గంటల పాటు పనిచేసి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలిపై అత్యాచారం, దారుణంగా హత్య చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదంటే దోషులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఐఎంఏ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, నర్సులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

