ఒగ్గుకథ కళా సంస్కృతి ఎంతో గొప్పది
– ఎమ్మెల్యే దృష్టికి కళాకారుల సమస్యలు
– తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఒగ్గుకథ జానపద కళా సంస్కృతి ఎంతో గొప్పదని, ఇందుకు తమవంతు ప్రోత్సహం అందిస్తామని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్హాల్లో ఒగ్గుకథ జానపద కళాకారుల సంఘం వికారాబాద్ జిల్లా 2వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిలో ఒగ్గు కథ జానపద కళా సంస్కృతి ఎంతో విభిన్నమైందన్నారు. ఇలాంటి కళలను భావి తరాలకు అందించాలన్నారు. ఒగ్గు కథ కళాకారుల సంస్కృతి అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని
అభిలాషించారు. కళాకారుల డిమాండ్లను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ ఒగ్గుకథ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుపల్లి నర్సింలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒగ్గు కళనే జీవనాధారంగా చేసుకున్న మాలాంటి యువ కళాకారులని గుర్తింపు కార్డులు అందించాలని, ఫించన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఒగ్గు కళ ని మరింత ప్రాచుర్యం తీసుకువచ్చే విధంగా ప్రోత్సహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, న్యాయవాది కె.గోపాల్, కళాకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.


