కంది బోర్డు ఏర్పాటుకే ప్రాధాన్యం
– తాండూరులో ఇంటిగ్రేటేడ్ మార్కెట్
– ఐనెల్లిలో రూ. 1.50కోట్లతో ఉల్లి స్టోరేజ్కు ప్రణాళికలు
– తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో కంది బోర్డుకు ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు, దీనికోసం స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ద్వారా ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. సోమవారం తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయంలో పాలకవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ విఠల్ నాయక్ అద్యక్షతన కంది బోర్డు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్, ఉల్లి స్టోరేజ్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో రైతులు అత్యథికంగా కందిని సాగుచేస్తున్నారని తెలిపారు. రైతులను దృష్టిలో ఉంచుకుని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అసెంబ్లీ సమావేశంలో కంది బోర్డు ఏర్పాటుపై ప్రస్తావించడం శుభపరిణామమన్నారు. అందుకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కంది రైతుల కోసం తాండూరులోనే కంది బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తాండూరు మార్కెట్ కమిటి తరుపున ప్రతిపాదనలు రూపొందించి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ద్వారా ప్రభుత్వానికి అందించేలా కృషి
చేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఇంటి గ్రేటేడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తోందని, ఇందులో భాగంగా తాండూరులో దాదాపు రూ. 8 కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు తాండూరు మండలం ఐనెల్లిలో ఉల్లి రైతుల కోసం స్టోరేజ్ ఏర్పాటు కోసం రూ. 1.50 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో రైతు సంక్షేమానికి బాధ్యతగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ రాజేశ్వరి, డైరెక్టర్లు ఆశన్న, భీమ్ రెడ్డి , సప్తగిరి, మల్లప్ప, పద్మమ్మ, దినేష్ సింగ్ ఠాగూర్, కటకం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.


