రైతుల ఆధాయం పెంచే స్కీం..!
– సబ్సీడీతో కేంద్ర ప్రభుత్వ పథకం
– సంవత్సరానికి రూ. 1లక్ష సంపాదించే చాన్స్
– అర్హులు ఎవరంటే, ఎలా దరఖాస్తులు చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం రైతులను అభివృద్ది పరిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్(పీఎం కుసుమ్) పథకం ఒకటి. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా సోలార్ పంపులు, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్లు, పునరుత్పాదక శక్తి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రైతులకు నీటి సదుపాయాల కోసం వాడుతున్న కరెంటు లేదా డీజిల్ మోటార్ల స్థానంలో అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని కరెంటు కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు, తాము వాడుకోగా మిగిలిన సౌర విద్యుత్ ను డిస్కంలకు విక్రయించుకుని ఆదాయం పొందేలా పీఎం కుసుమ్ పథకాన్ని రూపొందించారు.

అర్హులు ఎవరంటే…
రైతులు, డ్వాక్రా మహిళలు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు ఈ పథకానికి అర్హులు. అర్హత కలిగిన సంస్థలకు పునరుత్పాదక శక్తి పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ఈక్విటీ అందుబాటులో లేకపోతే స్థానిక డిస్కం ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ పథకానికి రైతులందరూ అర్హులు. ఇంత భూమి ఉండాలనే పరిమితి ఏంలేదు. రైతుల సమూహంగా ఏర్పడి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడీసీని అందిస్తాయి. దీని ద్వారా రైతులు ఏడాదికి రూ. 1,00,000ల వరకు సంపాదించవచ్చు.
ఏమేం పొందవచ్చు…
కాంపొనెంట్ A : గ్రౌండ్ / స్టిల్ట్ మౌంటెడ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ లేదా ఇతర పునరుత్పాదక పవర్ ప్లాంట్లు 500KW నుంచి 2 MW వరకు రైతులు సొంతంగా ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు.
కాంపొనెంట్ B : డార్క్ జోన్ ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న అగ్రికల్చర్ డీజిల్ పంపుల స్థానంలో 7.5 HP వరకు సోలార్ పంపులను ఏర్పాటు చేయడం.
కాంపొనెంట్ C: కరెంట్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో సోలార్ పంపుసెట్ సామర్థ్యం 2 HP కంటే తక్కువ ఉండకూడదు. గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంపుల సోలారైజేషన్ చేస్తారు. రైతులు వాడుకోగా మిగిలిన సోలార్ పవర్ను దగ్గర్లోని సబ్ స్టేషన్ ద్వారా డిస్కంలకు అమ్ముకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
రైతులు ముందుగా అధికారిక వెబ్ సైట్ pmkusum.mnre.gov.in లోకి వెళ్లాలి.
ఈ సైట్లో స్కీమ్ వివరాలు, రాష్ట్ర వారీగా అప్లికేషన్ లింక్ లు ఉంటాయి.
దరఖాస్తుదారులు వారి ప్రాధాన్యత మేరకు సౌరశక్తితో పనిచేసే వ్యవసాయ పంపులను ఎంచుకోవాలి.
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మొత్తం వివరాలు నమోదు చేయాలి. సంబంధిత పత్రాలను జోడించండి.
రైతులు సమర్పించిన అప్లికేషన్ ను అధికారులు క్షుణ్ణంగా సమీక్షిస్తారు.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు.
ఇదికూడా చదవండి…

