అర్దరాత్రి.. పసికందుకు సీపీఆర్..!
– పోతున్న ప్రాణంకు ఊపిరి
– 108 సిబ్బంది సమయస్పూర్తి
– తల్లీ బిడ్డా క్షేమం, తాండూరులో ఘటన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : అర్దరాత్రి ప్రసవంలో ఉలుకు పలుకులేని పసికందుకు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… కర్ణాటక సరిసద్దులోని ఈ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప, నాగమ్మకు మూడేళ్ల కిందట పెళ్లయింది. నాగమ్మకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టి నెల రోజులకే చనిపోయింది. రెండోసారి గర్భం దాల్చాక.. వైద్యులను సంప్రదిస్తే, కాన్పు కష్టంగా ఉండవచ్చని తెలిపారు.

శనివారం అర్ధరాత్రి ఆమెకు పురుటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేసి రప్పించారు. ఆ వాహనంలో నాగమ్మను తాండూరుకు తీసుకెళ్తుండగా.. తట్టేపల్లి వద్ద నొప్పులు ఎక్కువయ్యాయి. శిశువు ఒక కాలు మాత్రమే బయటికొచ్చి పరిస్థితి విషమంగా మారింది. వాహనాన్ని ఆపేసి.. ఈఎంటీ నర్సిములు చికిత్స చేయడంతో నాగమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువులో చలనం లేకపోవడంతో నర్సిములు సీపీఆర్ చేయడం ప్రారంభించారు. పసిబిడ్డ నోటి నుంచి ఉమ్మ నీరు తీస్తూ.. సీపీఆర్ కొనసాగించారు. కొద్ది నిమిషాల్లోనే బిడ్డ ఏడవటం మొదలుపెట్టడంతో అందరిలో ఆనందం వ్యక్తమైంది. తల్లీబిడ్డలను వైద్యపర్యవేక్షణ కోసం తాండూరు మాతాశిశు ఆసుపత్రిలో చేర్పించారు. పసికందు ప్రాణం కాపాడిన సిబ్బందికి, వైద్యులకు కుటుంభీకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి….

