ఇందిరమ్మ ఇంటి రూల్స్..!
– ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలంటే ?
– బిల్లుల మంజూరు విధానం ఇలా
– లబ్దిదారులు క్లారిటీగా తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగానే రెండో విడతకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఈ నిబంధనలపై లబ్దిదారులకు అవగాహన కరువైంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి. బిల్లులు ఎలా వస్తాయి..? అనే వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటి నుంచి 45 రోజుల్లో పనులు ప్రారంభించాలని, లేకపోతే రద్దు కానుందని చెబుతున్నారు.

400 చ. అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు నిర్మాణం ఉండాలని స్పష్టం చెబుతున్నారు. ఇల్లు మంజూరై ఉత్తర్వులు చేతికి అందాక 45 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు నిబంధనలపై పంచాతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఇల్లు మంజూరై ఉత్తర్వులు ఇచ్చాక పంచాయతీ కార్యదర్శి, హౌజింగ్ ఏఈ వచ్చి ముగ్గు పోసిన తర్వాతనే పనులు మొదలుపెట్టాలని నిబంధన విధించడం జరిగిందంటున్నారు. నాలుగు విడతల్లో బిల్లులు అకౌంట్లో జమ చేయనున్నామన్నారు. దశల వారీగా ఇంటి నిర్మాణ చిత్రాలను కార్యదర్శులు యాప్లో అప్లోడ్ చేస్తే, ఏఈ వెళ్లి కొలతలను తీసుకొని సమర్పిస్తారని వివరించారు.
ధరల నియంత్రణకు కమిటీలు
మరోవైపు ఇంటినిర్మాణ సామగ్రి ధరలు పెరగకుండా, తహసీల్దార్(ఎంఆర్వో), ఎంపీడీవో, గృహనిర్మాణశాఖ ఏఈ, కార్మికశాఖ అధికారితో మండల స్థాయిలో ‘ధరల నియంత్రణ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. వీరు డీలర్లు సిమెంట్, స్టీల్తో పాటు కంకర ధరలు, ఇంటి నిర్మాణ పనులు చేపట్టేటువంటి మేస్త్రీలు తమ కూలీ ధరలను పెంచకుండా చర్యలు తీసుకుంటారు.

ఇదికూడా చదవండి…

