వణికించిన వాన..!
– తాండూరులో కుండపోత
– జలమయమైన కాలనీలు
– గోదారులైన రహదారులు
– ఇబ్బందులు పడిన ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సోమవారం కురిసిన కుండపోత వాన పట్టణాన్ని వణికించేసింది. గంటల పాటు పడిన వానతో జనజీవనం అతలాకుతలమైంది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు గోదారులుగా మారి.. వర్షపు వరదలా ప్రవహించింది.

గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు సోమవారం ఒక్కసారిగా విశ్వరూపం చూపినంత పనిచేశాడు. సరిగ్గా సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున కురిసింది. వర్షం ప్రారంభమైన కొద్ది సేపటికే హైదరాబాద్ రోడ్డు మార్గం వరద నీటితో పోటెత్తింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓ వాహన దారుడు బైకుతో కొట్టుకపోయే స్థితి వెళ్లాడు. ఇక తాండూరు పట్టణంలోని సాయిపూర్, ఆదర్శనగర్, తులసీ నగర్, ముత్యాల గల్లి, మార్కండేయ కాలనీ, గ్రీన్ సిటీ, పాత తాండూరు, ఇందిరానగర్, మల్ రెడ్డి పల్లిలోని ప్రాంతాలలో మురుగు కాలువలు పోటెత్తాయి.

వరద నీటిలోనే పలువురు నివాసాల వద్ద కార్లు, ఆటోలు, బైకులతో పాటు చిన్నపాటి దుకాణాలు వాన నీటిలో ముగినిపోయి కనింపించాయి. ఈ దృశ్యాలు ప్రజలను వర్షం అంటే వణికించేలా చేశాయి. ఆదర్శనగర్, తులసీ నగర్, మార్కెండేయ కాలనీ, గ్రీన్ సిటిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈమార్గంలో ప్రవహిస్తున్న చిలుక వాగు వరధనీటితో ఉధృతంగా ప్రవహించింది. కోడంగల్ రోడ్డు మార్గంలో చిలుక వాగు నుంచి భారీగా వరదనీరు ప్రవహించింది. మార్కండేయ కాలనీలో ప్రజలు గొంతు వరకు నీటిలో తడిచి రాకపోకలు జరిపారు. ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు కుండపోత వర్షానికి ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మంగళవారం ఉదయం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పలువురు నాయకులు చిలుక వాగు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

ఇదికూడా చదవండి…

