సార్.. నేను మా నాన్నను చంపేశా..!
– డయల్ 100కు కాల్ చేసిన కసాయి కొడుకు
– పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో దారుణం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : సార్.. నేను మా నాన్నను దాడి చేసి చంపేశానని ఓ కసాయి కొడుకు డయల్ 100కు కాల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో కలకలం రేపింది.

పెద్దేముల్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హన్మంతు (70) గత కొంత కాలం కింద పక్షవాతానికి గురై బాధపడుతున్నాడు. అతని కుమారుడు రవి మద్యానికి బానిసై తండ్రితో గొడవ పడేవాడు. తండ్రి పేరుమీద ఉన్న భూమి పట్టాను తన పేరు పైకి మార్చాలని వాగ్వివాదం చేసేవాడు. అయితే బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న రవి ఇంట్లో ఉన్న తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు.

అనంతరం డయల్ 100కు కాల్ చేసి తన తండ్రిని హత్య చేసినట్లు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్ఐ వేణు కుమార్ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరూల్ సీఐ నగేష్ లకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, రూరల్ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు. కాగా ఈ సంఘటన గొట్లపల్లిలో కలకలం రేపింది.

ఇదికూడా చదవండి…

