డ్రోన్ల మిస్టరీలో క్లారిటీ..!
– రాత్రి చక్కర్లు కొట్టింది డ్రోన్లే కాదు
– పోలీసుల నిఘాలో బయటపడిన నిజాలు
– పోలీసులు ఎమని చెబుతున్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కలకలం రేపిన డ్రోన్ల చక్కర్లపై కొంత మేర మిస్టరీ వీడింది. పోలీసుల నిఘాలో డ్రోన్ల ప్రత్యక్షంపై కొన్ని నిజాలను బయటపెట్టారు.

గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సమక్షంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్లు డ్రోన్ల మిస్టరీపై విషయాలను బహిర్గతం చేశారు. నాలుగు రోజుల క్రితం పెద్దేముల్ మండలం ఇందూరు, నర్సాపూర్, పెద్దేముల్ తాండా తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఆ మరుసటి రోజే తాండూరు పట్టణం ఇందిరానగర్, సాయిపూర్, మల్ రెడ్డిపల్లి ప్రాంతాలలో రాత్రి వేళలో కూడా మళ్లీ డ్రోన్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. డ్రోన్ల ప్రత్యక్షంపై తాండూరు నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురికావడంతో ఆ తరువాతి రోజు తాండూరు రూరల్ సీఐ నగేష్ తన బృందంతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు.

అదేరోజు రాత్రి వేళ తమ వద్ద ఉన్న డ్రోన్లను పెద్దేముల్ మండలంలో ఎగురవేయించి విషయాలను తెలుసుకున్నారు. గురువారం కరణ్ కోట్ పోలీస్టేషన్లో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సమక్షంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి డ్రోన్ల చక్కర్లపై కొన్ని నిజాలను బయటపెట్టారు. పెద్దేముల్ మండలం, తాండూరు పట్టణంలో ఆకాశంలో ఎగిరినవి డ్రోన్లు కావని కొట్టిపారేశారు. అవి కింది స్థాయిలో ఎగిరే విమానాలు అని చెప్పుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వాటి లాండింగ్ విషయంలో సాంకేతిక అంతరాయం కలగినందు వల్ల వాటిని ఆకాశంలోనే లూప్ లైన్(అక్కడక్కడే తిరగడం)లో ఉంచడంతో చక్కర్లు కొట్టాయని వివరించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమాచారంతో పలువురు ఊరట చెందారు.

ఇదికూడా చదవండి…

