మన కవులు భళా..!
– ‘అమ్మకు అక్షర నైవేద్యం’లో తాండూరు కవుల రచనలు
– హర్షం వ్యక్తం చేస్తున్న సాహితీ ప్రియులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వివిధ రంగాల్లో కొనసాగుతున్నప్పటికి సాహితి రంగంలో రాణిస్తూ మన తాండూరు కవులు భళా అనిపిస్తున్నారు. అక్షరాలకు పట్టాభిషేకం చేస్తూ వెలికి తీస్తున్న రచనలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా 526 కవులు కవయిత్రుల కవితలతో లాల్ దర్వాజ సింహవాహిని శ్రీమహంకాళి అమ్మవారికి సమర్పించిన బృహత్ కవితాసంకలనంలో తాండూరు కవులు రచించిన కవితలకు చోటు దక్కింది. ప్రముఖ కవయిత్రి, యోగ శిక్షకురాలు శ్రీమతి బండి ఉష సంపాదకత్వంలో ఈ పుస్తకం వెలువడింది. చారిత్రాత్మకమైన ఈ కవితా సంకలనంలో తాండూరు కవుల కవితలు ప్రచురణకు నోచుకున్నాయి. స్థానిక కవులు కోటం చంద్రశేఖర్, ద్యావరి నరేందర్ రెడ్డి, రామకృష్ణరాజు, గాజుల పవన్ కుమార్ కలం నుండి జాలువారిన కవితలు ఇందులో ప్రచురించడం జరిగింది. సాహిత్య రంగంలో మన ప్రాంతానికి చెందిన కవులు ప్రసిద్దం చెందడం పట్ల ఉపాధ్యాయులు, సాహిత్య అభిమానులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

