పారదర్శకంగా ఎన్నికలు..!
– నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తం
– జిల్లాలో ఎన్నికలకు పట్టిష్ట ఏర్పాట్లు
– సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
– పరిశీలన తర్వాతే నామినేషన్ల పై చర్యలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం తాండూర్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటుచేసిన కౌంటర్లను తనిఖీ చేశారు. అభ్యర్థుల నుండి నామినేషన్ సేకరణ సరళి ఏ విధంగా జరుగుతుందని పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు ఏయే పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని.. ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నతాధికారులను సంప్రదించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోసం తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ లో 100 వార్డులకు గాను 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. ఆయా పోలింగ్ కేంద్రాల్లో 20 శాతం అదనంగా ఆర్వోలు ఏఆర్ఓ లను నియమించడం జరిగిందని వెల్లడించారు. జిల్లాలో 54 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని.. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే అభ్యర్థుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు వస్తే పరిశీలన రోజు తగిన ఆధారాలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ఖర్చుల విషయంలో కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని.. ఆ నిబంధన ప్రకారమే అభ్యర్థులు ఖర్చులు చేసుకోవచ్చని అన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసి పారదర్శకంగా ఎన్నికలను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి…

