బహిరంగంగా చెత్తేసినందుకు రూ.1500 జరిమాన
-తాండూరులో కొనసాగుతున్న తనిఖీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం పారిశుద్ధ్యంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతిరోజూ చెత్త, సేకరణ నిర్వహణపై తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బహిరంగంగా చెత్త వేసినందుకు ఓ దుకాణం యజమానికి తాండూరు మున్సిపల్ అధికారులు రూ.1500 జరిమాన విధించారు. తాండూరు పట్టణంలో చెత్త సేకరణ, నిర్వహణపై తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసిన మున్సిపల్ సిబ్బంది పట్టణంలో సాయిపూర్ రోడ్డు మార్గంలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేయడాన్ని గుర్తించారు.
స్థానికంగా ఉన్న ఓ కార్పెంట్ దుకాణ యజమాని వద్దకు వెళ్లి విచారణ తరువాత రూ.1500ల జరిమాన విధించారు. మరోసారి చెత్త వేయరాదని నోటీసును అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు సిహెచ్ అశోక్, బొట్టు శ్రీనివాస్, బాలు తదితరులు ఉన్నారు.

