పెత్తనం కోసమే బీజేపీ కుట్ర..!
– మహిళ బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మోడి ప్రభుత్వానికి మహిళలపై చిత్తశుద్ది ఉంటే మహిళ బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని అన్నారు. దీనికి మహిళ బిల్లును జోడిస్తూ ప్రవేశ పెట్టడం కుట్రలో భాగమే అని అన్నారు. మహిళల ఆదిపత్యాన్ని ఓర్వలేక డీలిమిటేషన్ బిల్లుకు మహిళ బిల్లును లింకు పెట్టడం దుర్మార్గపు ఆలోచనే అని అన్నారు.

డీలిమిటేషన్ బిల్లు వల్ల తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఆయా రాష్ట్రాలపై పెత్తనాన్ని చలాయించేందుకు బీజేపీ డీలిమిటేషన్ బిల్లు పెట్టిందని అన్నారు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని గుర్తించి తిప్పి కొట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర అభినందనీయమని అన్నారు.

పార్లమెంట్లో వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లు మాత్రమే అని మహిళ రిజర్వేషన్ బిల్లు కాదని అన్నారు. నరేంద్రమోడి ప్రభుత్వానికి మహిళలపై చిత్తశుద్ది ఉంటే 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.


