పేదల ఇళ్లు ప్రైవేటు పరం అప్రజాస్వామికం
– ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి పంచడం దుర్మార్గం
– బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్
తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరులో పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రైవేటు ట్రస్టుకు అప్పగించి పంచాలనుకోవడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్షాద్ మండిపడ్డారు.

ఆదివారం తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ట్రస్టు ఆధ్వర్యంలో 200ల డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం పట్ల అసంతృఫ్తి వ్యక్తం చేశారు. ఇళ్ల పంపిణీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.

ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లను పూర్తిగా పక్కనపెట్టి పంచాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా న్యాయంగా జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో, ఈ చర్యలు ఆ మాటలకు విరుద్ధంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, సమానత్వం ఉండాలని, కానీ ఇక్కడ జరుగుతున్న విధానం ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పంపిణీ పూర్తిగా ప్రజాప్రతినిధుల సమక్షంలో, పారదర్శకంగా జరగాలని అన్నారు. లేదంటే ఈ అంశంపై ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.


