ప్లాస్టిక్ నియంత్రణ అందరి బాధ్యత
– పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద
– పోలీసుల రక్షణ కవచంకు సహకరించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు పట్టణంలో వార్డు సభలు ముగిశాయి. పట్టణంలోని 27వ వార్డు పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్డు సభకు చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యంను మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టిస్తున్నామని అన్నారు.

వినాయక్ చౌక్ నుంచి పాత కూరగాయల మార్కెట్ వరకు ఉన్న కాలువను ఏర్పాటు చేసి మురుగునీరు లేకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. పట్టణంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంను నియంత్రించడంలో అందరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల వినియోగం తగ్గించాలని కోరారు.

అదేవిధంగా పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న రక్షణ కవచం కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాణ రక్షణ కోసమే వారు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు స్వరూప మల్లేశం, నవీన సంతోష్ గౌడ్, జుంటిపల్లి వెంకటేష్, నాగారం మల్లేశం, యోగానంద్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, రెవిన్యూ ఆఫీసర్ అశోక్, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


