శాఖాహారంతో గుండెపోటు దూరం

ఆరోగ్యం తాండూరు తెలంగాణ

శాఖాహారంతో గుండెపోటు దూరం
– రోజూ తింటే వచ్చే అవకాశాలు తక్కువే
– వైద్య ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి
ద‌ర్శిని డెస్క్: ఆహార‌పు అల‌వాట్ల‌తో ప‌లు ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు గుండె పోటుకు గురికాకుండా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్న స‌త్యం. మన జీవన శైలి, తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. శాఖాహారులతో పోలిస్తే మాంసాహారం తీసుకునేవారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువ అని మరో పరిశోధన వెల్లడించింది. శాకాహారులు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం తినేవారు గుండె జబ్బుల బారిన పడే లేదా చనిపోయే ప్రమాదం ఎంతవరకు ఉందనే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. దీనికి సంబంధించిన డేటాను యూకే బయోబ్యాంక్ నుంచి సేకరించారు. శాఖాహారులు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు.


శాఖాహారులకు గుండె జబ్బులు తక్కువ

శాఖాహారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, వీరు మాంసంకంటే హానికరమైన ఫాస్ట్‌ఫుడ్, స్మూతీ డ్రింక్స్, పిజ్జాలు.. వంటివి తింటున్నారని గుర్తించారు. కేవలం మాంసాహారం మానేసి, హానికరమైన ఇతర పదార్థాలను తీసుకుంటే అనారోగ్యాల ప్రభావం ఏమాత్రం తగ్గదని వారు చెబుతున్నారు. చేపలను మాత్రమే తినేవారు ఈ రెండు గ్రూపులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. వీరు ఇంట్లో చేసుకున్న వంటలు తినడానికి ఆసక్తి చూపుతున్నారట.


మాంసానికి బదులు చేపలు తింటే..

మాంసాహారానికి బదులుగా పెస్కటేరియన్ డైట్ (మాంసానికి బదులుగా కేవలం చేపలు మాత్రమే తినేవారు)ను ప్రోత్సహించాలని గ్లాస్గో యూనివర్సిటీ ప్రొఫెసర్, అధ్యయన బృంద సభ్యుడు జిల్ పెల్ చెబుతున్నారు. పెస్కటేరియన్ డైట్‌ను ఫాలోఅయ్యేవారు గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువని తమ పరిశోధనలు తేల్చాయని ఆయన చెప్పారు. మాంసం వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. చేపలు ఎక్కువగా తినేవారికి పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి గుండెజబ్బులను సమర్థంగా ఎదుర్కోగలవని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.