తాళం వేసిన ఇంట్లో చోరీ
– 2 కిలోల వెండి, పట్టు చీరల అపహరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 2 కిలోల వెండి ఆభరణాలతో పాటు విలువైన పట్టు చీరలను అపహరించుకు పోయారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ గిరిలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం మల్లప్ప మడిగ ప్రాంతంలోని వ్యాపారి ఎస్.రాజేంద్ర కుమార్ ఈనెల 4న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి గురువారం మద్యాహ్నం ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం ఊడదీసి

ఉండడంతో పాటు తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందర వందరగా పడిఉన్నాయి. బీరువాలో ఉన్న 2 కిలోల వెండి ఆభరణాలు, 10 విలువైన పట్టుచీరలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ముందుగా ఎస్ఐ గిరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్రెడ్డిలకు సమాచారం అందించారు. విషయం తెలిసిన డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరీశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


