పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నిందితుల రిమాండ్
– వివరాలను వెల్లడించిన రూరల్ సీఐ జలంధర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నిందితులను తాండూరు రూరల్ పోలీసులు రిమాండుకు తరలించారు. సోమవారం రూరల్ సీఐ జలంధర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 14న తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన కొందరు యువకులు డయల్ 100కు కాల్ చేసి బెల్టుషాపులపై ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోలింగ్ పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ ఆశంతో పాటు మరో 8 మంది పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించారు. అప్పట్లో పోలీసులు తీసిన వీడియో ఆధారంగా మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నిందితులుగా ఉన్న ఏ-7 వడ్డె వెంకటయ్య, ఏ-8 కొత్తపేట నరేష్లను ఈనెల 18న అరెస్టు చేశారు. మిగతా వారిలో ఏ-1 ఆశం, ఏ-2 వల్లరి మల్లేష్, ఏ-3 బోయిని నర్సింలు, ఏ-5 వల్లరి నరేష్, ఏ-6 చంద్రకుమార్, ఏ-9 బోయిని గొవింద్లను సోమవారం అరెస్టు చేశారు. మరోవైపు ఏ-4 వల్లరి శ్రీనివాస్ పరారిలో ఉన్నాడు. ఈ మేరకు అదుపులోకి తీసుకున్న నిందితులను సోమవారం రిమాండుకు తరలించినట్లు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

