రైతు కుటుంబానికి జీవనోపాధి చేయూత అభినందనీయం
– తెలంగాణ విద్యావంతు వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్
– కిసాన్ బంధు ద్వారా రైతు కుటుంబానికి పాడి ఆవు వితరణ
ధారూర్, దర్శని ప్రతినిధి: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చిత్తశుద్ది, ఔధార్యం చూపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. ధారూర్ మండలం హరిదాస్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కిసాన్ బంధు ప్రతినిధులు సతీష్, స్నేహల సమక్షంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా రైతు కుటుంబానికి రూ. 40 వేల విలువైన పాడి ఆవును అందజేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో, సేవా భావంతో తమ వంతు చేయూతను అందివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కిసాన్ బంధు సంస్థ ప్రతినిధులు సతీష్, స్నేహలు చేస్తున్న సేవలను అభినందించారు. కరోనా పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు ‘కిసాన్ బంధు’ సంస్థ ఎంతో భరోసా భరోసాను కల్పించిందని అన్నారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య భార్య లక్ష్మికి పాడి ఆవుతో పాటు నిత్యావసర సరుకులను కూడ అందజేశారు. కిసాన్ బంధు ద్వారా అందించిన సహాయంతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న మరోరైతు పాపయ్య కుమారుడు అనిల్, దీపికలను చదివించేందుకు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు వెంకట్రాములు ముందుకు వచ్చారు. అనిల్ డిగ్రీ, దీపిక ఇంటర్ డిగ్రీ చదివించేందుకు దత్తత తీసుకుంటున్నట్లు వెంకట్రాములు ప్రకటించారు. వారిని సొంత ఖర్చులతో చదివిస్తానని పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులు, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో TVV రాష్ట్ర నాయకులు విజయలక్ష్మి, లక్ష్మి, అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

