కరణ్ కోట్లో తాగునీటి ఎద్దడి
– సమస్యను పరిష్కరించిన బోయ అశోక్
– పెన్నా సహాకారంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. గత నాలుగు రోజులుగా గ్రామంలోని 9,10 వార్డులలో తాగునీటి కట కట ఏర్పడడంతో స్పందించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ సమస్యను పరిష్కరించారు. నాలుగు రోజులుగా నీళ్లు లేక ఆయా కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ఉపసర్పంచ్ హేమంత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ ఆరోపించారు. టీ.సుధాకర్ ద్వారా విషయం తెలుసుకుని సమస్య పరిష్కారం కోసం పెన్నా కర్మాగారాన్ని సహాయం కోరారు. వారి సహకారంతో గ్రామానికి తాగునీటి ట్యాంకులను తెప్పించారు. నీళ్లులేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుధాకర్, కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు.


