బల్దియాలోకి రైతు బజార్..!
– మున్సిపల్కు అప్పగించిన మార్కెట్ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రైతు బజార్ను మున్సిపల్ శాఖ పరిధిలోకి వెళ్లుతుంది. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి రైతు బజార్ను మున్సిపల్కు అప్పగించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, కార్యదర్శి రాజేశ్వరితో కలిసి మున్సిపల్ అధికారులకు ప్రోసిడింగ్ అందజేశారు. తాండూరు పట్టణంలో నూతనంగా నిర్మించబోయే సమీకృత మార్కెట్ నిర్మాణంలో భాగంగా నాలుగు ఎకరాల్లో ఉన్న రైతు బజార్ ను మున్సిపల్ అధికారులకు అందిస్తున్నట్లుగా చైర్మన్ విఠల్ నాయక్ తెలిపారు. సమీకృత మార్కెట్ నిర్మాణంలో భాగంగా కూరగాయల మార్కెట్ తో పాటు చేపలు, మాంసం దుకాణాలు ఒకేచోట ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రామ్ రెడ్డి, అధికారులు, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

