హైద‌రాబాద్‌కు పాకిన అగ్నిప‌థ్ సెగ‌..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

హైద‌రాబాద్‌కు పాకిన అగ్నిప‌థ్ సెగ‌..!
– సింకిద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో విధ్వంసం
– రైళ్ల‌ను త‌గుల‌బెట్టిన ఆందోళ‌న కారులు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అగ్నిప‌థ్‌ ఆందోళనలు హైదరాబాద్‌కూ వ్యాపించాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అగ్నిపథ్‌ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్‌మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సికింద్రాబాద్‌లో యువకులు ఆందోళన నిర్వహించారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌న కారులు రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. స్టేష‌న్‌లోని మూడు రైళ్ల‌కు నిప్పంటించారు. విష‌యం తెలుసుకుని వ‌చ్చిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త తనెలకొంది. ప్రయాణికులు భయంతో స్టేషన్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. అనుకోని ఈ ఘటనతో రైల్వే అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు.

ప‌రిస్థితి విష‌మం
రైల్వే పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్ల రువ్వడంతో.. వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని పలువురిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.