పంతుళ్లకు ఉపశమనం

తెలంగాణ హైదరాబాద్

పంతుళ్లకు ఉపశమనం
– ఆస్తుల ఉత్తర్వులు రద్దు
– ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధిః ప్రభుత్వ టీచర్ల ఆస్తిని ప్రకటించాలనే షాకిచ్చిన సర్కారు జారీ ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితరెడ్డి కొత్త ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు టీచర్లు ఫ్లాట్‌ కొనుగోలు చేసినా, ప్లాట్‌ కొనుగోలు చేసినా, ఖరీదైన ఆభరణాలు కొన్నా లెక్కలు చెప్పాలని ఆదేశిస్తూ సర్క్యూలర్‌ జారీ చేశారు. అయితే టీచర్ల నుంచి వ్యతిరేక రావడంతో పాటు టీచర్లలో గందరగోళం ఏర్పడటం.. ప్రతి పక్షాలకు ఇదో అస్త్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజిలెన్స్‌ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారని, పొరపాటు జరిగిందని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.