ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యం తగదు
– ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలి
– టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామిని నిలబెట్టుకోకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించడం తగని పద్దతి అని తెలంగాణ జన సమితి తాండూరు ఇంచార్జ్, కౌన్సిరల్ సోమశేఖర్, తెలంగాణ విద్యా వంతుల వేదిక పర్యాద రామకృష్ణలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పిలుపు మేరకు ఎంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా కన్వినర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజు కొనసాగింది. గురువారం ఈ దీక్షకు టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, టీవీవీ నాయకులు పర్యాద రామకృష్ణలు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతూ.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై అధికారంలోకి వచ్చిన తరువాత బిల్లును ప్రవేశ పెడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామిని విస్మరించడం అప్రజాస్వామికన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామి మేరకు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ల పోరాటానికి అండగా ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్, శివాజీ, రావణ్, వినయ్, ఆనంద్, రాములు తదితరులు పాల్గొన్నారు.



