జయ.. జయ..జయ.. జయహే..!
– దద్దరిల్లిన సామూహిక జాతీయ గీతాలపన
– ఎక్కడిక్కడ పాల్గొన్న నేతలు, ప్రజా ప్రతినిధుల
– దేశభక్తిని చాటుకున్న విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: జనగన మంగల దాయక జయహే.. అంటూ జాతీయ గీతం తాండూరులో మార్మోగింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు నియోజకవర్గంలో సామూహిక జాతీయ గీతాలాపన మహోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంతో పాటు మండలాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రోడ్లపై ప్రయాణికులు, గ్రామస్తులు దేశభక్తితో జాతీయ గీతాలాపన చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన వార్డులో ప్రజలు, మహిళలు, చిన్నారులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది జాతీయ జెండాకు వందనం సమర్పిస్తూ జాతీయ గీతాన్ని ఆలాపించారు. పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసం వద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, బంటు మల్లప్ప, బిర్కడ్ రఘు, నేతలు సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు.

తాండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, నాయకులు గౌడి వెంకటేశం, అధికారులు, సిబ్బంది సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు.

మరోవైపు తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపనలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి పాల్గొని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలాపించారు.



