తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
– పలు జిల్లాలకు అప్రమత్తం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఉత్తర భారతం నుంచి తిరోగమనంలో పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణపై నుంచి చురుగ్గా కదులుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున స్థిరంగా కొనసాగుతోందని దీని ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆయా జిల్లాల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని అదేశాలు జారీ చేశారు.


