గాంధీని అసురుడిగా చిత్రీకరణ అవమానకరం
– చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
– వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: జాతిపిత మహాత్మ గాంధీజీని అసురుడుగా చిత్రీకరించడం అవమానకరమని వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో కలకత్తా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో కాళీమాత వద్ద గాంధీ చిత్రాన్ని అసురుడుగా చిత్రీకరించారు. తెలంగాణ రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశాల మేరకు మంగళవారం తాండూరులో వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని గాంధీ విగ్రహంతో పాటు ప్రత్యేక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీని అసురుడుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకవచ్చిన మహాత్మున్ని ఆసురుడుగా చిత్రీకరించడం అవమానకరమన్నారు. ఆర్యవైశ్యులు ఏకమై దీనిని ఖండించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ జిల్లా, తాండూరు నియోజకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

