కాంగ్రెస్తోనే ఇందిరమ్మ రాజ్యం
– తాండూరులో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
– నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు. శనివారం భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ తాండూరు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా చౌరస్తాలోని ఇందిరమ్మ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని అన్నారు. పేద ప్రజల కోసం స్వర్గీయ ఇందిరమ్మ ఎంతో కృషి చేశారని అన్నారు. పేదరిక నిర్మూలనకోసం 20సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారని, రాజ భరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం, డ్వాక్రా పథకంతో పాటు ప్రారంభంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, పేదలకు భూముల పంపిణీ లాంటి పథకాలు ఇందిరమ్మ చేశారని గుర్తుచేశారు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కేంద్రంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కార్య కర్తలు, యువజన కాంగ్రెస్, NSUI,SC, ST, BC, మైనార్టీ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

