యూఎస్లో తాండూరు యువకుడి మృతి
– మిస్సోరిలోని సరస్సులో మునిగి కన్నుమూత
– తీవ్ర విషాధంలో వైద్య విద్యార్థి కుటుంబం
– మృతదేహాన్ని త్వరగా అందించాలని వేడుకోలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: యునైటేడ్ స్టేట్స్ మిస్సోరిలో తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన వైద్య విద్యార్థి మృతి చెందాడు. మిత్రుడితో కలిసి సరస్సులోకి వెళ్లిన ఇద్దరు ప్రమాద వశాత్తు ఏర్పడిన ప్రమాదంలో నీట మునిగి కన్నుమూశారు. ఇందులో అక్కడి పోలీసులు తాండూరుకు చెందిన విద్యార్థి మృతదేహాన్ని గుర్తించగా మరో విద్యార్థి ఆచూకీ లభించలేదు. తాండూరులో ఉన్న కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణంలోని అపెక్స్ హాస్పిటల్ యజమాని వెంకటేశం, జ్యోతిలకు ఇద్దరు కుమారులు విక్రమ్, రెండో కుమారుడు శివదత్త(25)లో యూఎస్లోని మిస్సోరి ఉంటున్నారు. అన్న విక్రమ్ ప్రవేట్ ఉద్యోగం చేస్తుండగా శివదత్త వైద్య వృత్తి(డెంటల్ ఎంఎస్) కోసం గత జనవరిలో మిస్సోరి స్టేట్కు వెళ్లారు. శివదత్త మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్సీటి(ఎస్ఎల్యూ) యూనివర్సిటిలో డెంటల్ కోర్సు చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం శివదత్త అతని స్నేహితుడుతో సలి మిస్సోరిలోని ఓజార్క్ సరస్సు(లేక్) వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాద వశాత్తు ఇద్దరు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త మృతదేహాన్ని వెలికితీశారు. ఆదివారం నాటికి మరో విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేదు. శివదత్త మృతి చెందిన విషయం తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగ విలపిస్తున్నారు. శివదత్త మృతదేహాన్ని అప్పగించడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో బాధితులు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్కు తెలపడంతో ఆయన స్పందించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి మృతదేహాన్ని త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.

