దంచికొట్టిన వాన..!
– పట్టణంలో నీటమునిగిన కాలనీలు
– మండలాల్లో పొంగిపొర్లిన వాగులు, వంకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో శనివారం రాత్రి వాన దంచికొట్టింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాన జోరు కొనసాగింది. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పలు ప్రాంతాలు, పంట పొలాలు నీటమునిగాయి. అంతేకాకుండా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాత్రి కురిసిన వర్షానికి మున్సిపల్ పరిధిలోని గౌతాపూర్ రోడ్డుమార్గంలో ఉన్న కాలనీలు, గ్రీన్సిటి, సాయిపూర్, పాత తాండూరు,తదితర ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇండ్ల చుట్టు నీళ్లు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అంతారంలో నీట మునిగిన పంటలు
ఇక తాండూరు మండలంలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో తాండూరు మండలం అంతారంలో ఊర చెరువు పొంగింది. అంతారం, అంతారం తాండ మీదుగా నిర్మిస్తున్న బైసాస్ కట్ట తెగిపోయింది. బైపాస్ రోడ్డు అటు, ఇటూ పొలాలు నీటమునిగాయి. చెంగోల్ వద్ద ఊర చెరువు అలుగు పారింది. దీంతో చెరువు కింది భాగంలో వరి పొలాలు మునిగిపోయాయి. అల్లాపూర్, ఐనెల్లి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉధృతి తగ్గిన తరువాత పోలీసులు వాహనాలను తరలించారు. మరోవైపు యాలాల మండలంలో కాగ్ననది నిండుకుంది. జుంటుపల్లి ప్రాజెక్టు అలుగు పారి ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఉధృతంగా ప్రవహిస్తున్న జుంటుపల్లి ప్రాజెక్టు

