ప్రాణం తీసిన రిసార్ట్ రిస్కీ గేమ్..!
– దాచిన వస్తువు కోసం బావిలో దూకిన వ్యక్తి మృతి
– వీకేండ్ ఎంటర్టైన్మెంట్లో విషాదం
– వికారాబాద్ సమీపంలో ఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: వినోదాన్ని పంచడమే ఉద్దేశమని ఓ రిసార్ట్ ఏర్పాటు చేసిన రిస్కీ గేమ్ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. వీకేండ్ ఎంటర్టైన్మెంట్ అవుదామని వచ్చిన బృందానికి విషాధాన్ని మిగిల్చింది. వికారాబాద్ సమీపంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హైదారాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో వికారాబాద్ సమీపంలోని గోదమగూడలో మూన్లైట్ రిసార్ట్ నిర్వహిస్తున్నారు. శనివారం హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు ఈ రిసార్ట్కు వచ్చారు. అయితే రిసార్ట్ నిర్వాహకులు ఎంటర్టైన్మెంట్ అంటూ ఓ డేంజర్ గేమ్ను ప్రారంభించారు. ఎక్కడో కనిపించకుండా దాచిపెట్టిన వస్తువుని కనిపెట్టడమే ఈ గేమ్ టార్గెట్. రిసార్ట్స్ వాళ్లు ప్లాన్ చేసిన ఈ డేంజర్ గేమ్లో సాయి కుమార్ అనే వ్యక్తి కూడ పార్టిసిపేట్ చేశారు. అయితే, రిసార్ట్స్ నిర్వాహకులు ఓ వస్తువును బావిలో దాచిపెట్టారు. దాన్ని కనిపెట్టేందుకు బావిలో దూకిన సాయి కుమార్… శవమై బయటకు తేలడంతో.. జాలీ ట్రిప్ కాస్తా ట్రాజెడీగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బావిలోంచి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం.. వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.

