అసలేదో.. నకిలేదో..!
– దొంగనోట్ల తేడా గుర్తించండి ఇలా
– వీటిని గమనిస్తే ఈజీగా తెలుసుకోవచ్చు
– సూచనలు ఇచ్చిన ఆర్బీఐ బ్యాంకు
దర్శిని డెస్క్: దేశంలో కొత్త నోట్లు చలామణిలోకి వచ్చిన తరువాత నకిలీ నోట్లు కూడ చలామణిలోకి వస్తున్నాయి. వీటిని గుర్తించక వినియోగదారులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురువున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. అయితే అసలు నోటు ఏది.. నకిలీ నోటు ఏది అనేది గుర్తించడంలో అందరు కాస్త తడబడుతుంటారు. అందుకే వారి కోసం ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొన్ని సూచనలు ప్రకటించింది. వీటిని గమనిస్తే అందరు నకిలీ నోట్ల నుంచి అప్రమత్తం కావచ్చు. పదండి ఆ సూచనలు ఏంటో తెలుసుకుందాం. నకిలీ నోట్లను పైపైనా చూసి గుర్తించడం కష్టమే. కానీ, కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అసలేదో.. నకిలీదేదో తెలిసిపోతుంది.
500 నోటులో తేడాలు
– ముందుభాగంలో నోటు ఎడమవైపు కిందిభాగంలో తెలుపు, గోధుమవర్ణంలో 500 సంఖ్య కనిపిస్తుంది.
– నోటుని 45 డిగ్రీల కోణంలో వంచి చూసినట్లయితే.. నోటు కిందిభాగంలో ఉన్న ఆకుపచ్చ స్ట్రిప్లో 500 సంఖ్యని గమనించవచ్చు.
– స్ట్రిప్ పైన 500 సంఖ్య దేవనాగరి లిపిలో రాసుంటుంది.
– నోటు మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రపటం కనిపిస్తుంది.
– నోటును వంచి చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే భద్రతా తీగ.. నీలంలోకి మారుతుంది.
– భద్రతా తీగ కుడివైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం, దానికింద ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
– దాని పక్కనే 500 సంఖ్య ఎలక్ట్రోటైప్ వాటర్మార్క్ను గమనించొచ్చు.
– నోట్ల సిరీస్ను తెలియజేసే సంఖ్యలు కుడివైపు కిందిభాగంలో ఎడమ నుంచి కుడికి సైజు పెరుగుతూ కనిపిస్తాయి.
– నోటు కుడివైపు కిందిభాగం చివరన భారత జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ ఉంటుంది.
– వెనక భాగంలో ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
– స్వచ్ఛభారత్ నినాదంతో కూడిన లోగో కనిపిస్తుంది.
– దేశంలోని 15 భాషల్లో నోటు విలువను పేర్కొంటూ లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది.
– లాంగ్వేజ్ ప్యానెల్ పక్కనే దిల్లీలోని ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది.

